17 నవం, 2011

ఒంగోల్లో రాష్ట్ర స్థాయి కథా సదస్సు

ఒంగోల్లో రాష్ట్ర స్థాయి కథా సదస్సు
వేదిక; హోటల్ మౌర్య కాంఫరెన్స్ హాల్ ,ఒంగోలు
తేదీ; నవంబర్ 26,27 శని ఆదివారాలు
రాంకీ ఫౌండేషన్ సౌజన్యం తో శాంతివనం-వారధి సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోల్లో కథా సదస్సు మరియు వర్క్ షాప్ జరుగును.ఈ సదస్సులో తెలుగు కథ పూర్వాపరాలు,
కథా వస్తువు -శిల్పం నిరంతర పరిణామం
పిల్లలు యువతలో కథా సాహిత్య వ్యాప్తి
వివిధ దేశాల మంచి కథల పరిచయం
తెలుగు భాష-ప్రస్తుత పరిస్థితి
ప్రపంచీకరణ అనంతర పరిణామాలు
అనువాద కథ రాస్ట్రేతర రచయితలతో సంభాషణ
వివిధ ప్రాంతాల కథా విస్తరణ పై చర్చ జరుగును ఇంకా నూతన కథా సంకలనాలు పరిచయం జరుగును.
ఈ సదస్సులో కె. శ్రీనివాస్ ,పాపినేని శివశంకర్ ,ముకుంద రామారావు,బి.ఎస్.రాములు,నల్లూరి రుక్మిణి,ఏ.కే ప్రభాకర్,విహారి,పరవస్తు లోకేస్వర్,పెద్దింటి అశోక్ కుమార్,రామా చంద్ర మౌళి ,వి. చంద్ర శేఖర్రావు ,వాసిరెడ్డి నవీన్,ఏ.యన్.జగన్నాధ శర్మ,సా.వెం.రమేష్ ,కే.యన్ మల్లేస్వరి,పెనుగొండ లక్ష్మీనారాయణ,పూడిరి రాజిరెడ్డి,యంవీ రామిరెడ్డి వి.ప్రతిమ,హెచ్చార్కె ,తుమ్మేటి రఘోత్తం రెడ్డి,ఆరెం వుమామహేశ్వర్ రావు,,చింతపట్ల సుదర్శన్,రఘునాధ-కర్ణాటక ,వెంకట క్రిష్ణ ,పలమనేరు బాలాజీ,బా రహంతుల్లా,జీ వుమామహేశ్వర్,దగ్గుమాటి పద్మాకర్,జిల్లేళ్ళ బాలాజీ,అజయ్ ప్రసాద్,సుంకోజీ దేవేంద్రా చారి,
మరియు ప్రకాశం జిల్లా రచయితలు అందరూ పాల్గొంటారు.
వేదిక హోటల్ మౌర్య కాంఫరెన్స్ హాల్ ,ఒంగోలు
తేదీ 26,27 నవంబర్ 26,27 శని ఆదివారాలు

8 నవం, 2011

అజయ్ ప్రసాద్ కథల గురించి

ఏ నక్షత్రం లో పుట్టేడో కానీ కథల్ని సొంతంగా చూసింది చూసినట్టురాస్తున్నాడు అజయ్ ప్రసాద్ మృగశిర అయినా చిత్త కార్తె అయినా వున్నదివున్నట్టురాయడం మామూలు విషయమేమీకాదు.రాయడం లో కూడా వేదాంతంరాస్తున్నట్టుగానే రాయడంఇంకా గొప్ప విషయమే .అటు బెల్లిగువ్వ ఇటు జెముడుకాకి కూడా తత్వం మాట్లాడుతున్నట్టుగానే వున్నాయి.రెండు పక్షుల మధ్యసంభాషణని కథ రూపంలోకి తేవడం ,పక్షులు మాట్లాడుతున్నవి అనే విషయంమర్చిపోయి పాఠకుడు కథలోకి పొవాలంటే వాతావరణం చాలా పకడ్బందీగా వుండాలి. అయినా మృగశిర ని కథ చేశాడు.ఆ కథ కూడా చదివే కొద్దీ ఆయువు పట్టు మీదగురి చూసి కొట్టి నట్టు వుంది. సన్యాసుల మధ్య సంభాషణలైనా,శాస్త్రవేత్తలు ఎగిరే పళ్ళాలు గురించిఅయినా మల్టీమిలియన్ కంపెనీల సియీవోలు మాట్లాడుకుంటున్నా అదేందో అక్కడేకూర్చుని వాళ్ళు మాట్లాడుకునేవి విని రాసినట్టు రాస్తాడు.ఎక్కడా ఒక్కవాక్యం తియ్యడానిక్కానీ ఎయ్యడానిక్కానీ వీలుండదు.ఒక వాక్యం చదావక పోతేఏదో పోగొట్టుకున్నట్టుగా వుంటది. కథ చదువుతూ చదువుతూ కాసేపు అలా శూన్యంలోకి చూసి కాసేపు కళ్ళుమూసుకుని ఏవో జ్ఞాపకాల్ని నెమరేసుకుని మళ్ళీ కథలోకిజొరబడదామనిపిస్తుంది.ఒక కథ చదివి అలా పక్కన పెడితే ఏదో జీవన ఆంతర్యంబోధపడుతున్నాట్టూగా అనిపిస్తది.లోలోపల లోతులేవో బూడుతున్నట్టుగా వుంటది. పరుగెత్తుతున్న మనుషులు ఎందుకు పరుగెత్తుతున్నారో అర్థమై ఆ పరుగేఆపేద్దామనిపిస్తది.కదలకుండా కూర్చున్నోడికి నేనెందుకు జడ పదార్థంలాకూర్చున్నానోనని లేచి నడక సాగిద్దామనిపిస్తది. మొత్తానికి కథలంటే ఇలాంటి జీవిత సత్యాల లాగా వుండాలేమో కథలంటేకాకమ్మలు,పిచ్చుకమ్మలు చెప్పినా అచ్చమైన జీవితాల్లాగా వుండాలేమోఅనిపిస్తుంది.అజయ్ ప్రసాద్ ప్రకాశంజిల్లా కన్న బిడ్డ అయినా సాహిత్యానికిజీవితానికి ఎల్లలేమిటి.కథ కథే కథ జీవితమే కదా.

18 అక్టో, 2011

అమ్మా నువ్వీయాల బతికే వుంటే!



అమ్మా నువ్వీయాల బతికే వుంటే!

నాలుగు క్షణాల వెచ్చని ధార కోసం
కాట్లాడుకునే ఈ సంక్షోభ క్షణాల్లో
అమ్మా నువ్వే గనక బతికే వుంటే
ఆకలో ఆకలో యని వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుస్తూ
వెక్కిళ్ళుబెట్టేటప్పుడు
ఒడిలో పడుకోబెట్టుకుని
అంతరంగాల్లో సుళ్ళు తిరిగే కళ్ళ నీళ్ళు తుడుస్తూ
లాలి పాటలతొ చందమామ దాకా ఎగిరెళ్ళే వెన్నెల్లో
గోరుముద్దలు గొంతుజారే దాకా తినిపించే దానివి కదా

గుడ్డులోంచి వెలికొచ్చినప్పటినుండి
ఊహల పొదరిళ్ళలో
బాల్యం బంతిని చేసి తన్నక ముందే
సజీవమైన నీ నవ్వే వుంటె
వెన్నంటీ నువ్వుంటే
పాల బుగ్గల పసిడి కందులకు
పాలనురగ ఆప్యాయతలు పంచే తల్లుల
ఆత్మీయతల్ని కాస్త కస్త నంజుకుంటూ
నాతో ఆడ్డానికొచ్చే ప్రత్యర్థుల్ని
నిలువునా గుమ్మాయి దెబ్బల్లో బొంగరాలుగా
చీల్చేసే వాణ్ణే కదా

నీ ఆప్యాత నంతా కూరి కూరి
నా భుజాన బరువు సంచీ పుస్తకాల్లా వేలాడ దీసుంటే
ఆత్మన్యునత కన్నీళ్ళను గడపకివతలే
మాసిన గుడ్డల్లా విడిచేసి
ఎక్కే పొద్దులా ఎదిగి పోయే వాణ్ణి కదా

నీ ఓదార్పు మాటలు తారక మంత్రంలా నా చెవిని సోకివుంటే
ఎంతెంతో ఎత్తెదిగి చిటరుకొమ్మల్లో
మిఠాయి పొట్లాల్నీ నా సావాస గాళ్ళకి సైతం
కొమ్మొంచి దూసి పోసే వాణ్ణి కదా

నడిచిన నా బాటెంటంతా
అడుగులు నీ అర చేతులై వుంటే
సాగిపోయే మనూరి డొంకల్ని రాచబాటల్ని పోయించేది కదా
కన్నీరింకిన కన్నుల్నిండా
దొరువుల్లో దోర్చి పోసిన నీళ్ళు నింపి వుంటే
చూపు సారించినంత మేరా
సస్యశ్యామలమై పోయేది కదా

ఊహలు వుయ్యాల లూగే తరుణాన
నా కళ్ళ పాడెల మీదుగా నడిచేళ్ళి
చేతుల్నిండా కొరివి మంటల్ని మొలిపించి
దింపుదు కళ్ళాం ఆశల్ని మిగిల్చావు
ఇయ్యాల నీ ఋ ణం తీర్చుకుందామన్నా నాకీ కవిత్వం దానం చేసి
నన్నొక ఋణ గ్రస్తుణ్ణిగానే మిగిల్చి పోయావా



9 అక్టో, 2011

అమ్మా నుఇవ్వీయాల బతికే వుంటే!



నాలుగు క్షణాల వెచ్చని ధార కోసం
కాట్లాడుకునే ఈ సంక్షోభ క్షణాల్లో
అమ్మా నువ్వే గనక బతికే వుంటే
ఆకలో ఆకలో యని వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుస్తూ
వెక్కిళ్ళుబెట్టేటప్పుడు
ఒడిలో పడుకోబెట్టుకుని
అంతరంగాల్లో సుళ్ళు తిరిగే కళ్ళ నీళ్ళు తుడుస్తూ
లాలి పాటలతొ చందమామ దాకా ఎగిరెళ్ళే వెన్నెల్లో
గోరుముద్దలు గొంతుజారే దాకా తినిపించే దానివి కదా

గుడ్డులోంచి వెలికొచ్చినప్పటినుండి
ఊహల పొదరిళ్ళలో
బాల్యం బంతిని చేసి తన్నక ముందే
సజీవమైన నీ నవ్వే వుంటె
వెన్నంటీ నువ్వుంటే
పాల బుగ్గల పసిడి కందులకు
పాలనురగ ఆప్యాయతలు పంచే తల్లుల
ఆత్మీయతల్ని కాస్త కస్త నంజుకుంటూ
నాతో ఆడ్డానికొచ్చే ప్రత్యర్థుల్ని
నిలువునా గుమ్మాయి దెబ్బల్లో బొంగరాలుగా
చీల్చేసేఋ వాణ్ణే కదా

నీ ఆప్యాత నంతా కూరి కూరి
నా భుజాన బరువు సంచీ పుస్తకాల్లా వేలాడ దీసుంటే
ఆత్మన్యునత కన్నీళ్ళను గడపకివతలే
మాసిన గుడ్డల్లా విడిచేసి
ఎక్కే పొద్దులా ఎదిగి పోయే వాణ్ణి కదా

నీ ఓదార్పు మాటలు తారక మంత్రంలా నా చెవిని సోకివుంటే
ఎంతెంతో ఎత్తెదిగి చిటరుకొమ్మల్లో
మిఠాయి పొట్లాల్నీ నా సావాస గాళ్ళకి సైతం
కొమ్మొంచి దూసి పోసే వాణ్ణి కదా

నడిచిన నా బాటెంటంతా
అడుగులు నీ అర చేతులై వుంటే
సాగిపోయే మనూరి డొంకల్ని రాచబాటల్ని పోయించేది కదా
కన్నీరింకిన కన్నుల్నిండా
దొరువుల్లో దోర్చి పోసిన నీళ్ళు నింపి వుంటే
చూపు సారించినంత మేరా
సస్యశ్యామలమై పోయేది కదా

ఊహలు వుయ్యాల లూగే తరుణాన
నా కళ్ళ పాడెల మీదుగా నడిచేళ్ళి
చేతుల్నిండా కొరివి మంటల్ని మొలిపించి
దింపుదు కళ్ళాం ఆశల్ని మిగిల్చావు
ఇయ్యాల నీ ఋ ణం తీర్చుకుందామన్నా నాకీ కవిత్వం దానం చేసి
నన్నొక ఋణ గ్రస్తుణ్ణిగానే మిగిల్చి పోయావా

13 సెప్టెం, 2011

నాన్నను చూశాక

నాన్నను చూశాక
గ్రీష్మం యధాలాపంగా
తాపాన్ని ప్రకటించింది
ఎండలు వెన్నెల నీడల్ని వెదజల్లుతున్నాయి
నేత్రాలు సైతం అగ్ని గోళాలుగా మారుతున్నాయి
అరికాళ్ళు పగుళ్ళిచ్చి
కత్తి అంచు మీద విన్యాసాలు పోతోంది
నాలుక అంగిట్ళోకి పిడచకట్టూకపోతుంది
చుట్టూతా ఎటు చూసినా నేలను ఎడారి ఆవరించుకుంటోంది
ఎటునుంచొచ్చే గాలైనా వడగాడ్పులే వీస్తోంది
నేలపైననే సుడిగుండాలు గింగుర్లెత్తుతున్నాయి
నిర్జలమైన దేహం శుష్కించి
చివరి అంచులకు చేరుకుంటోంది
వన దేవత నీగ్రో సుందరి రూపం దాలుస్తుంది
అయినా ఆయన క్రీస్తంత దయాళువు
నాపై హిమాలయాలంత ఆప్యాతలు పంచుతూ
నా వసంత కాలం కోసం
ఆయన గ్రీష్మాన్ని నిరంతరం
శాలువలా వొళ్ళంతా ధరిస్తూనే వున్నాడు

10 సెప్టెం, 2011

ఆమె


ఒక్కోసారికలవరపాటు
ఏ రూపంలోనైనా
దృశ్యాన్ని దోచుకుంటుంది
పైరగాలి చాటు నుండి కదలిపోతున్న కలహంసలా
వులికిపటుకూ వూపిరందిస్తుంది
అనుకుంటాంగానీ
మనకు తెలియకుండానే
గుండెల్నిండా వూపిరి పీల్చుకున్నంత నిండుగా
నల్దిక్కులూ భూకంపం తాకినంత వుదృతంగా
హృదయం కంపిస్తుంది
ఏమీ తెలియని హద్దుల ఆనవాళ్ళలో
కలువల కన్నులు చూపు సారించిన బాణమైనప్పుడు
కంపించడమంటే
ఆమెను చూసినప్పుడే
ఈకంపనమే గొప్ప స్వాప్నిక దృశ్యం
ఎందుకయ్యా ఈ సృష్టిలో
ఇన్నిన్ని రంగురంగుల మయూరాలూ
మనసుని కంపింప చేసే ప్రకృతి దృశ్యాలూ
మరీ ముఖ్యంగా
ఎన్నెన్ని జన్మ లెత్తినా ఎంతెంతగా వీక్షీంచినా
తనివి తీరని ఆమె సౌందర్యాలూనూ.....................

ఉపాధ్యాయ సంఘాల నాయకులకిది తగునా !


విధ్యార్థుల స్థాయిని బట్టి ఉపాధ్యాయుల బోధనను అంచనా వేయడం సమంజసం కాదని ,విద్యార్థుల సామర్థ్యాలు కేవలం ఉపాధ్యాయుల బోధన పైననే ఆధార పడి వుండవని ,విద్యార్థుల ఫలితాలను బట్టి ఉపాధ్యాయులను సాధిస్తే ఉద్యమలను చెయ్యల్సి వస్తుందని ఉపాధ్యాయసంఘాల నాయకులు ప్రకటించడమే మహా విడ్డూరంగా అనిపిస్తుంది
విద్యార్థుల సామర్ద్యాలు ,అభివృద్ధి కేవలం ఉపాధ్యాయుల బోధనా తీరు పైననే ఆధార పడి వుంటాయి.ఏ పిల్లలు ఏ స్థాయిలో వున్నారో గమనించి వారికి తగినట్టుగా బోధిస్తే ఫలితాలు అద్భుతంగా వుంటాయని నిరూపిస్తున్నాము.గత 2 సంవత్సరాలుగా ఉపాధ్యాయ శిక్షణలు అధ్బుతమైన లక్ష్యసాధనాల దిశగా సాగుతున్నాయి.రిషి వేలీ ప్రయోగాలను కూడా ఈ శిక్షణలో పొందుపరచడం జరిగింది.మరి ఇంతకంటే ఉపాధ్యాయులు నేర్చుకునేదేమైనా వుందా.
అయితే ఉపాధ్యాయులు శిక్షణలను మొక్కుబడిగా తీసుకోవడము,వారికి ఉపాధ్యాయ సంఘాలు వత్తాసు పలకడము సర్వ సాధారణ మై పోయింది.కనీసం సంఘాల నాయకులకైనా శిక్షణల పట్ల అవగహన వుంటే ఇలాంటి ప్రకటనలు ఇచ్చి వుండే వారుకాదు. ఎన్నెన్నో వినూత్న పద్దతులు వస్తుంటే మెకాలే కాలంనాటి వుపన్యాస పద్ధతినే ఇప్పటీకీ పాటిస్తుంటే ఏ విధ్యార్థులలోనూ ఎలాంటి ప్రగతిని సాధించలేము
ఉపాధ్యాయులు నూతన పోకడలు అందిపుచ్చుకుంటే విధ్యార్థులలో ఏ సామర్థ్యాలైనా అభివృద్ధి చెయ్యవచ్చు కానీ ఉపాధ్యాయలోకం ఏదైనా కొత్తగా నేర్చుకోడానికి సిద్ధంగా వుందా! నేర్పడానికి ఉపాధ్యాయ సంఘాలు సిద్ధంగా వున్నాయా !విద్యా సదస్సులంటే కేవలం ఆప్రాంత నాయకులను అధికారులను పిలిచి మొక్కుబడిగా సాగే వుపన్యాసాలు తప్ప ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా!
ప్రపంచీకరణ ప్రైవేటీకరణ విద్యా వ్యవస్థను తల్లక్రిందులుగా చేస్తున్నా...ఏమీతెలియనట్టు పాలుతాగే పిల్లి చందంగా ఉపాధ్యాయ సంఘాలు వ్యవహరిస్తే రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
ఉపాధ్యాయుల సంక్షేమం తో పాటుగా విధ్యార్థుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయ సంఘాలు గుర్తెరగాలాల్సిన సమయం ఆసన్నమైంది.విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు కానీ,ఉపాధ్యాయులకోసమే విద్యార్థులు కాదు కదా!


11 ఆగ, 2011

నగరంలో దారి తప్పిపోయిన మనుషులు

నగరంలో దారి తప్పిపోయిన మనుషులు

నగరంలో మీరు అటో ఇటో తిరుగుతున్నప్పుడు

ఎక్కడైనా రోడ్డు మీద నీరు కావి పంచె కట్టు మనుషులు కనడితే

చీదరించుకుని తలలు తిప్పుకుని పోవొద్దు

వాళ్ళు అంతకు ముందెప్పుడో

మన నాన్నలో అన్నలో అయి వుండొచ్చు

మనం తొక్కుకుంటూ తోసుకుంటూ బస్సు లెక్కుతున్నప్పుడు

మట్టి వాసన వేసే మనుషులు కనిపిస్తారు

వాళ్ళను చూసి నొసలు చిట్లించుకోవొద్దు

వాళ్ళుఅప్పుడెప్పుడో మన తాతలు ముత్తాతల్లాంటి వాళ్ళు కావచ్చు

గడ్డాలు పెరిగి మట్టి గొట్టుకు పోయిన మనుషులు చెయ్యెత్తితే

ఆటో వాడికైనా ఈసడింపు పుట్టొచ్చు

కాస్త ఆటో ఆపి వాళ్ళను ఎక్కించి పుణ్యం కట్టుకోండి

వాళ్ళు మనకు అన్నం పెట్టి కడుపు నింపే రైతన్నలే కావొచ్చు

నగరం అరణ్యం కదా

ఆ అరణ్యంలో దారి తప్పిన దానయ్యలు

నోరు పిడచ కట్టుకుపోయి అడ్డం పడి పోవొచ్చు

కాసిని మంచినీళ్ళు మొహాన కొట్టి లేపండి

వాళ్ళు అనంత దయామయులైన పల్లె ప్రవక్తలు కావొచ్చు

మనసు వద వద లాడుతూ

వొళ్ళంతా చెమ్మతో తిరిగే మనుషులు కనబడతారు

బండరాళ్ళ మన కంటికి మనుషులుగా వాళ్ళు కనబడక పోవొచ్చు

వాళ్ళను చూసి మనుషులెలా వుంటారో కాస్త గుర్తుకు తెచ్చుకుందాం

వాళ్ళు మానవత్వం తప్ప మరేమీ తెలియని మన పూర్వీకులు కావొచ్చు

ఇక్కడ తిక్కల తిక్కలగా దిక్కులు చూసే అరవ్వోళ్ళు కనిపించొచ్చు

వాళ్ళని పిచ్చివాళ్ళ కింద జమ కట్టొద్దు

వాళ్ళు ఇంటింటికీ వూరూరికీ

రహదార్లేసిన రాయబారులు కావొచ్చు

లుంగీ బొడ్డు కాడికి ఎగ్గట్టి తల ఆకాశంలోకి ఎగరేస్తూ

బారెడు బారెడు అంగలు వేసే వాళ్ళని చూసి

ఎవుడ్రా ఈ బైతుగాడని దూరదూరంగా తొలగొద్దేం

వాళ్ళు వూళ్ళో ఎవురికే రోగమూ రొష్టూ వొచ్చినా ముందుగా పరుగులు తీసే

మన బాబాయిలూ మామయ్యలూ కావొచ్చు

కాళ్ళు వొడిలిపోయి నడుం వొంగిపోయి

బోటుకర్ర పొడుచుకుంటూ

రోడ్డు దాటడానికి తంటాలు పడే పండు ముసలోళ్ళు కనపడితే

మీ ఏసీ కార్ల బ్రేకుల మీద కాలు పెట్టడం మరిచిపోకండేం

వాళ్ళు మనల్ని భుజాలకెత్తుకుని

మోస్తూ కథలు చెప్పిన తాతయ్యలు కావొచ్చు

మోకాళ్ళు దాటే కరక్కాయ చెడ్డీలేసుకుని

రోడ్డు కడ్డంగా పరిగెత్తే పిల్లకాయల్ని చూసి విసుక్కోకండేం

వాళ్ళు బాల్యంలో మన సావాస గాళ్ళెవరైనా కావొచ్చు

సైకిలు మీద రోడ్డంత పొడుగు గడ్డి మోపుల్ని లాక్కుపోతుంటారు

వాళ్ళను చూసి కసురుకోవొద్దేం

పాటిమీద నుండో గరువు చేలో నుండో

మనం మోసిన మోపులు ఒక్కసారి గెవనానికి తెచ్చుకోండి

పాల తపేళాలు తీసుకుని వాకిటి ముందుకొస్తుంటారు చూడు

అమాయకంగా మొకాలు వేలాడేసుకుని

కడుపుకూటి కోసం వొస్తారు వాళ్ళు కామంగా చూడకండేం

వాళ్ళు ఎప్పుడో మన అక్కయ్యలో చెల్లెళ్ళో కావొచ్చు

ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని వైద్యుణ్ణి దేవుళ్ళా చూస్తూ కాళ్ళు మొక్కుతూ

ఆసుపత్రుల వాకిట అడుగుపెడతారు వాళ్ళు

లాభనష్టాల బేరీజు వాళ్ళమీద వేసుకోకండేం

వెనకటికి మన అయ్యలో అమ్మలో అయ్యుంటారు వాళ్ళు

ఎవుడో డలారి ముండా కొడుకు బారిన పడి

కోర్టు మెట్లెక్కాల్సి వొస్తుంది పాపం వాళ్ళకు

తల కొట్టేసినట్టున్నా తప్పక వొస్తారు

వాళ్ళను ముద్దాయిలుగానే చూడకండేం

వాళ్ళు వెనకటికి నీతీ నిజాయితీగా బతికిన మన గ్రామ పెద్దలే కావొచ్చు

కాళ్ళ జోళ్ళు లేకుండా రోడ్డు కడ్డం పడతారు వాళ్ళు

కాయకష్టం మనుషులు వాళ్ళు

కూడలి కూడలికీ అడ్డాల నిండా గుంపులు గుంపులుగా

అరసకలాడుతుంటారు వాళ్ళు

పశువులనుకుంటారేమో

ఆకలి కేకల చకోర పక్షులు వాళ్ళు

వీళ్ళంతా లేకుంటే క్షణ కాలం కాలు కదపలేని అవిటి వాళ్ళం మనం

పైపై పూతలు తగిలించుకు తిరిగే నాటకాల రాయుళ్ళం మనం

లోపలి ప్రేమా ఆప్యాయతలు బంధాను బంధాలు

పచ్చటి చేలలా పండించేది వాళ్ళు

ఆ పైర గాలి వీచందే ఏ పంటా పండదు

తరతరానికీ వారధి కట్టే మారాజులు వాళ్ళు

వాళ్ళు లేందే ఏ ఇంటా కడుపు నిండదు

11 జూన్, 2011

నగరంలో దారి తప్పిన మనుషులు


నగరంలో మీరుఅటో ఇటో తిరుగుతున్నప్పుడు
ఎక్కడైనా రోడ్డు మీద నీరు కావి పంచె కట్టు కనపడితే
చీదరించుకుని తలలు తిప్పుకుని పోవొద్దు
వాళ్ళు అంతకు ముందెప్పుడో
మన నాన్నలో అన్నలో అయి వుండొచ్చు

మనం తొక్కుకుంటూ తోసుకుంటూ బస్సులెక్కుతున్నప్పుడు
మట్టి వాసన వేసే మనుషులు కనిపిస్తారు
వాళను చూసి నొసలు చిట్లించుకోవొద్దు
వాళ్ళు మన తాతలు ముత్తాతల్లాంటి వాళ్ళు కావచ్చు

గడ్డాలు పెరిగి మట్టి గొట్టుకు పోయిన మనుషులు చెయ్యెత్తితే
ఆటో వాడికైనా ఈసడింపు పుట్టొచ్చు
కాస్త ఆటో ఆపి వాళ్ళను ఎక్కించండి
వాళ్ళు మనకు అన్నం పెట్టి కడుపు నింపే రైతన్నలు కావొచ్చు
నగరం అరణ్యం కదా
ఆ అరణ్యంలో దారి తప్పిన దానయ్యలు
నోరు పిడచ కట్టి అడ్డం పడి పోవొచ్చు
కాసిని మంచినీళ్ళు మొహాన కొట్టి లేపండి
వాళ్ళు అనంత దయామయులైన పల్లె ప్రవక్తలు కావొచ్చు

మనసు వదవద లాడుతూ
వొళ్ళంతా చెమ్మతో తిరిగే మనుషులు కనబడతారు
బండరాళ్ళ మన కంటికి మనుషులుగా వాళ్ళు కనబడక పోవొచ్చు
వాళ్ళను చూసి మనుషులెలా వుంటారో కాస్త గుర్తుకు తెచ్చుకుందాం
మానవత్వం తప్ప మరేమీ తెలియని వాళ్ళు కావొచ్చు

తిక్కల తిక్కలగా దిక్కులు చూసే అరవ్వోళ్ళు కనిపించొచ్చు
వాళ్ళని పిచ్చివాళ్ళ కింద జమ కట్టొద్దు
వాళ్ళు ఇంటింటికీ వూరూరికీ
రహదార్లేసిన రాయబారులు కావొచ్చు

శాంతివనం ఫ్రీ సమ్మర్ కేంప్లో పిల్లలు రకరకాల ప్రతిభ కనబరిచారు

శాంతివనం ఫ్రీ సమ్మర్ కేంప్లో పిల్లలు రకరకాల ప్రతిభ కనబరిచారు
.వాళ్ళళ్ళొ వుండే సృజనాత్మకతను చంపేసి వాళ్ళను మర యంత్రాలుగా మార్చేస్తున్న దోషులం మనం
.అందుకే ఒంగోల్లో పిల్లల తరపున శాంతివనం పనిచేస్తుంది
.సమ్మర్లో నెల రోజుల పిల్లలకు ఆట ,పాట, బొమ్మ ,మోడల్,తయారీలో శిక్షణనిచ్చాం
.పిల్లలు ఏదైనా చెయ్యగలరని నిరూపించుకున్నారు.




30 మే, 2011

ఇప్పుడు మనుషులు మాట్లాడే మాటలు కావాలి

ఇప్పుడు మాటలు కావాలి
మంచి ముత్యాలు జల్లులుగా కురిసే
మాటల మమతలు కావాలి
పెదాల అంచుల్లో పూసే సుగంధ పరిమళాలు కావాలి
గాలి సయ్యాటల్లో తేలియాడే
పరిమళాలు వెదజల్లే పూదోటలు కావాలి
ఆప్యాయంగా పలకరించే హృదయపు ఆలింగనాలు కావాలి
అశాంతి వెల్లువై పారే మనుషుల వృక్షాల కొమ్మ కొమ్మనూ వంచే
తేటతేట తేనె పలుకులు మల్లెలుగా కురవాలి
కన్నుల సందిట పూసే సిరిమువ్వలు గజ్జెలుగా రాలాలి
కాలం కావ్యాన్ని నవ్వించే మాటలు పాటలు కావాలి
మానవ స్పర్శలు పెంచే హృదయ వీణియలు మీటే
గట్టిమాటల మనుషులు కావాలి
వెల్లువల్లో కొట్టుకు పోయే మనుషుల్ని ఆపి కూర్చోబెట్టి
సేదతీర్చే మాటల లేపనాలు కావాలి
అవి ప్రసరించే ఎల్లలు లేని ఆనందాలు కావాలి

18 మే, 2011

అణువణువునా

కనిపించిన
ప్రతి కొమ్మా రెమ్మా పైనా
నీ చెక్కిలి గులాబి సంతకంతరచి తరచి చూస్తాను
ఎ పక్షి గొంతులో పాటై పగిలినా
అది నువ్వే కృతి చేసి మీటిన
సంగీతమేనని చెవులారా వింటాను
అర విరిసిన ఎ పువ్వును చూసినా
అది నువ్వు నవ్విన నవ్వేమో నని
ఆత్రంగా దోసిలి పడతాను

అబద్దం వెనుక నిజం

ఫట్ మని విరిగే కర్ర ముక్కలా
పుటుక్కుమని పగిలే కుండ పెంకులా
తటాలున తెగిపోయే చెప్పు వుంగ టంలా
పై నుండి రాలిపడే తాటి మట్టలా
నిజం వెంట అబద్దంలా అబద్దాన్నంటు కున్న నిజంలా
సుఖం వెనుక దుక్ఖం లా
బ్రతుకు పటాన్ని
మరణమేప్పుడూ అంటి పెట్టుకునే వుంటుంది
యాంత్రిక సామ్రాజ్యం మనిషికి
మంత్రించి ఇచ్చిన మణిహార వరమిది

దేశభక్తీ జిందాబాద్

పిల్లికి బిచ్చం పెట్టరు
గొంతు ఎండి పోయే వాడికి
గుక్కెడు నీళ్ళు పోయ్యరు
పక్క మనిషి చావు బతుకుల్లో వున్నా
కన్నెత్తి కూడా చూడరు
విరిగిన వేలుపై వుట్టి పుణ్యానికి
ఓంటేలైనా పోయ్యరు
పచ్చి నెత్తుర్లు తాగడానికి
కత్తులనైనా కౌగలించు కుంటారు
కొన్ని సారా పేకెట్ల కే జీవితాల్ని బలి తీసుకుంటారు
నమ్మిన వాడి మూలుగుల్నించి
రక్తాన్ని జలగల్లా పీల్చుకుంటారు
క్రికెట్ మార్కేట్టాట కొట్లాటలో
ఒకే ఒక్క విజయానికే
వీరంగాలు వేస్తారు
టపాకాయలు కాలుస్తారు
మిఠాయిలు పంచుతారు
తాగి తమ్దనాలాడతారు
జెండాలతో చిందులు వేస్తారు
నానా రకాల నజరానాలు ప్రకటిస్తారు
వహ్వా దేశభక్తి జిందాబాద్

17 ఏప్రి, 2011

శాంతివనం విద్యా సాహిత్య సాంస్కృతిక,సేవా సమితి

ఒంగోల్లో కొంతమంది మిత్రులం కలిసి శాంతివనం ఫౌండేషన్ స్థాపించాము. దీని ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటుగా వాళ్ళలో వున్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం,కథా సాహిత్యం చదివించడం,కథలు రాయించడం,మంచి పిల్లల సినిమాలు చూయించడం ,వాటి గురించి విశ్లేషణలు రాయించడం చేశాము పాఠశాలల్లో గ్రంథాలయాలు ప్రారంభించడం వంటి కార్యక్రమాలతో పాటుగా పేదపిల్లల ను దత్తత తీసుకుని వాళ్ళను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను కూడా తీసుకుని కాలక్రమములో శాంతివనం సంస్కృతి కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యం గా ఈ ఫౌమ్దేషణ్ ప్రారంభించాము. అక్కడ నుండే ప్రతిభావంతులైన ,బాధ్యతాయుతమైన పౌరుల్ని ,సామజిక బాధ్యత కలిగిన పిల్లలుగా తీర్చిదిద్దే బాధ్యత శాంతివనం స్వీకరించింది. ఇంకా భావ సారూప్యత కలిగిన మిత్రులను కూడా భాగస్వాములను చేసే వుద్దేశంతో సభ్యులనుగా చేర్చుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఈ సంస్థలో భ్హగాస్వాములు కావచ్చు,s