27 అక్టో, 2010

భూమి తల్లి అన్నపూర్ణమ్మరా!

ఎవ్వరికి మరణ శిక్షలు వరమాలలుగా అవసరము లేదు
ఎ వోక్కరిని ఎన్కౌంటర్ భూతాలూ ఆవహించ పనిలేదు
ఆయేషాలూ,మనిషాలూ,వైష్ణవిలూ
బలవంతపు బాయిలర్లలో బుగ్గి కావాల్సిన పనిలేదు
ఏ ప్రభాకర్లూ గుండెలు పగిలి
చితి మంటల తోడుగా నింగికి పయనించాల్సిన పనిలేదు
తెలుగు నేలనేలంతా విలవిలలాడి పోతుంది
భూమి నుదిటిపై నాగలి సంతకం చేస్తే
గర్భం విచ్చుకుని విత్తనాలకై చేతులు చాస్తుంది
వాన జల్లు వొడిలో చేరితే పరవసించి మొక్కై శిరస్సు పైకే ఎత్తుతుంది
మొక్క పులకరిస్తే కంకులు పాలు పోసుకుంటాయి
అన్నపూర్ణ చేతులు సాచిన వానికి ఆకలి తీరుస్తుంది
భూమిని నమ్ముకోకుండా అమ్ముకు తింటూ ఉన్నందుకు
చిట్టి తల్లుల్ల్ని చిన్ని బాలల్ని బలి కోరుకుంటున్నది
ఒరే నాయనలారా రాజనాలు పండించే భూమిని
తులాభారం తూయకండిరా
పిల్లల మెడలకు నాగుబాములై చుట్టుకుంటాయి

ఒక నెలంతా తెలుగు భాషోత్సవం

నవంబర్ ఒకటి నుండి నెల చివరి దాకా ఒక నెల రోజులపాటు ఒంగోల్లో కళాశాలలు ,పాఠశాలల్లోభాషా మాసోత్సవం నిర్వహించాలని మిత్రుల సహకారం తో ,మరియు శాంతి వనం మిత్రుల ప్రోత్సాహం తొ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము.పాఠశాలల్లో పిల్లలతో భాషకు సంబంధించిన కవిత,పద్యం,వుత్తరం,గేయం ,కథా రచన,కథా విశ్లేషణ,ఒకసంఘటన తెలుగులోనే మాట్లాడ్డం,కవిత్వం చదవడం కథ చదవడం,కళాశాలల్లో కథ రాయడం,కవిత్వం చదవడం,రాయడం,మాట్లాడ్డం వంటి ప్రక్రియలు చేయించి వాళ్లకు తెలుగు పుస్తకాలే బహూకరించి నెల చివరలో అన్ని పాఠశాలలు ,కళాశాలలకు కలిపి పోటీ పెట్టి వాళ్ళనుండి రచయితలుగా స్పార్క్ వున్న
వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాము.
ఇలాగే తరువాత కూడా ప్రతి ఆదివారము వర్క్ షాప్ లు నిర్వహిస్తూ ఒక వాతావరణాన్ని కల్పిస్తూ పిల్లలకు తెలుగు పుస్తక పఠనము ఒక అలవాటుగా ,రచన కూడా అలవాటుగా చేసి,పిల్లల పత్రిక మొదలు పెట్టి ,పిల్లల రచనలతోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాము.ఈ కార్యక్రమాలలో పాలు పంచుకునే వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాము.ఇలాంటి ప్రయత్నాలు అక్కడక్కడా జరిగితే కొంతవరకైనా తెలుగు భాష బతికిబట్టకడితే బాగుంటుందని మా ఈ చిన్న ప్రయత్నం.ఎవరైనా మా ఈకార్యక్రమములో పాల్గోనాలన్నా ఇదే మా ఆహ్వానం.

హైదరాబాదులో కథా వర్క్ షాప్

అక్టోబర్ వతేదిన హైదర్ గూడా ప్రోగ్రెసివ్ మీడియా సెంటర్ లో వారధి రచయితల వేదిక తరపున కథా వర్క్ షాప్ జరిగింది. సదస్సులో తుమ్మేటి రఘోత్తం రెడ్డి,గుడిపాటి,వాసిరెడ్డి ణావిన్ జాజుల గౌరీ,గోగు శ్యామల,ఖదీర్ బాబు,షరీఫ్,రాజ్యలక్ష్మి,సమతా రోష్ని,ఉమామహేశ్వర్ ,తాయమ్మ కరుణ,విజయలక్ష్మి,సా వెం రమేష్ బాబు,శ్రీనివాసరెడ్డి,స్కైబాబా ,పూదూరి రాజిరెడ్డి,రహంతుల్లా,వెంకటేష్,మొదలైన వారు పాలుగొన్నారు

ఇవాల్టి కథకులు ఎదుర్కొంటున్న సమస్యలు ,కథా రచన పరిణామాలు,మొదలైన విషయాలు చర్చిం చారు.
వారధి కథా సంకలనం ,కొత్త తరాన్ని కథల్లోకి ఆహ్వానించే అవసరాన్ని ,దానికి అవసరమైన మార్గాలను అన్వేషిం చడములో వారధి తనవంతుగా తన బాధ్యతను నిర్వహిస్తూ అనేక ప్రాంతాలలో వర్క్ షాప్ లనూ కథల పోటీలను నిర్వహించ దలచామని వారధి రచయితలూ అందరూ ఏక గ్రీవంగా తెలియజేసారు.రాబోయే కాలములో కథా సంకలనాలను ప్రచురించడము పంపిణి చెయ్యడమూ ఇంకా విస్తృతంగా చెయ్యాలని సమావేశం తీర్మానిం చింది.ఈ సమావేశానికి విచ్చేసిన అతిధులందరూ వారధి అభివృద్దికి తగు సలహాలూ ,సూచనలూ అందజేశారు.

1 అక్టో, 2010

ఒంగోల్లో కథారచయితల వర్క్ షాప్

అక్టోబర్ రెండో వారంలో ఓంగోల్లో రెండు రోజుల కథా వర్క్ షాప్ జరిగింది .అల్లం రాజయ్య,ప్రతిమ ,సమతా రోష్ని ,మొలకలపల్లి కోటేశ్వరరావు ,వి చెంచయ్య ,జి. కళ్యాణరావు ,రుక్మిణి ,వరలక్ష్మి' రాజ్యలక్ష్మి సజ్జా ,విజయలక్ష్మి ,తాయమ్మ కరుణ ,చిన్నయ్య ,రాఘవరెడ్డి ,కరుణ మొదలైన కథా రచయితలూ ,నూతన కథారచయితలు ,ఈ వర్క్ షాపులో పాలుగొన్నారు .రెండు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమములో ఎనిమిదిమంది కథకులు తమ కథలు చదివి వినిపించారు .వాటిపై అందరూ తమ అభిప్రాయాలు చెప్పగా కథకులంతా ఉత్సాహంగా స్వీకరించారు .ఇలాంటి కార్యక్రమాలు ఇలాగ జరుగుతాయని తెలియదని ఎంతో ఉద్వేగంగా చెప్పారు .కథలపై మాండలికాలపై ,కథనంపై ,శిల్పం పై చర్చ జరిగింది.రెండవ రోజు కొత్తపట్నం బీచ్ లో సముద్రము వొడ్డున సమావేశములో కథకులు తమ కథలను ఉత్సాహంగా చదివారు .
ఈ వర్క్ షాప్ స్పూర్తితో వారధి సహకార వేదిక ఆధ్యర్యంలో పలు వర్క్ షాప్ లను జరపాలని నిర్ణయించుకున్నాము .అక్టోబర్ ౩ వ తేదీన హైదరాబాదులో బషీర్ బాగ్ లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నాము .