31 మే, 2010

మేధావులారా ఆలోచిద్దాం రండి !

ఏ సమాజపు స్థితిగతులైనా ఆ సమాజంలో అమలుచేసే విద్యావిధానంపైనే ఆధారపడి ఉంటుంది.సమాజంలో అనేకరకాలైన సమస్యలను పట్టించుకునే మేధావులు విద్యావంతులు సైతం భాషా,సంస్క్రుతి,విద్యలను పట్టించికోకపోవడం దురద్రుష్టకరం.
పసిపిల్లల నుండి యువకుల వరకు వారిలో ఉండే సామర్ధ్యాలను నిర్వీర్యం చేసే చదువులు అన్ని ప్రాంతాలకు పాకుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉండడం ఒక్క తెలుగు సమాజానికే చెల్లింది.
ఐదు సంవత్సరాలనుండి మాత్రుభాషలో విద్యాబోధన వల్ల భాషాసామర్ధ్యం పెరుగుతుంది. ఆతరువాత ఏ భాష అయినా సులభంగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఏదేశంలోనైనా మాత్రుభాష ద్వారాబోధించే పద్దతే ఆమల్లో ఉంది.మన పిల్లలకు 2-3 సంవత్సరాలనుండే ఇంగ్లీషును నూరిపోస్తున్నాము.అంటే ఈ వయసులోనే పిల్లల్ని పక్కదారి పట్టిస్తున్నాము.మాత్రుభాష తెలియకుండానే ప్రాధమిక విద్య భాషా సామర్ధ్యాలు నేర్చుకోకుండానే పిల్లలు గట్టెక్కేస్తున్నారు.
ఇక ఆరవతరగతి నుండి ఐఐటి ఫౌండేషన్ పేరుతో ఊదర గొట్టేస్తున్నారు.ఉపాధ్యాయులంటే తప్పనిసరిగా మనోవిగ్నాన శాస్త్రం తెలిసిన వారై ఉండాలి.మరి మన పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులెవరు?పాఠ్యపుస్తకాలలోని విషయాన్ని పదేపదే బట్టీ కొట్టించి తరగతులు గట్టెక్కించేస్తున్నారు.అంటే పాఠ్యపుస్తకాలకు సంబంధించిన విషయాలుగానీ ,సామాజిక విషయాలు కానీ ఏమీ నేర్చుకోకుండానే పదవ తరగతి గట్టెక్కుతున్నారు.వీళ్ళకు భాష తెలియదు,సంస్క్రుతి తెలియదు.సమాజ స్థితి గతులు తెలియవు.పుస్తక పఠనమంటే అస్సలు తెలియదు.
ఇక్కడ నుండి కుస్తీ పోటీలు మొదలవుతాయి.పిల్లల ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యతగానీ అభిరుచులకు ప్రాధాన్యతగానీ ఉండదు.పొలోమంటూ నలుగురు నడిచే దారిలో కళ్ళు మూసుకోని పరుగులు తియ్యడమే.ఈ రెండు సంవత్సరాలు ఎంతగా రసం పీల్చి పిప్పి చెయ్యాలో అంతగా పిప్పిజేసి మార్కెట్ విద్య పేరుతో మార్కెట్లేని విద్యలోకి నెట్టేస్తున్నాము.అంటే ఇక్కడా పిల్లల ఇష్టాయిష్టాలతో పనిలేదు.ఒక అవగాహనలేదు.ఒక ఆలోచనలేదు,ఒక ద్రుక్పదములేదు,జీవితము మీద అంతకంటే అవగాహనలేదు.అలాంటి పిల్లలు సమాజములోనికి వస్తే ఏం జరుగుతుంది.అంతా అరాచకమే గదా !ఇలాంటి పశు ప్రవ్రుత్తి కలిగిన యువతరాన్ని సమాజము మీదకు వదిలి వేస్తున్నాము.ఇక సమాజములో మేధావులెలా పుడతారు.శాస్త్రవేత్తలు ఎక్కడి నుండి వస్తారు.సమాజాన్ని గురించి ఆలోచించేవాళ్ళు ఎక్కడి నుండి పుడతారు.కనీసం వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకోలేని ఒక తరం మన కళ్ళ ముందు తిరుగాడుతూ ఉంది.
వీటికి తోడు ఇంటర్నెట్,సెల్ఫోన్,టీవీ వంటి మంత్ర సామాగ్రి ఉండనే ఉంది.వీటికి ఎంత సమయము కేటాయిస్తారో,వీటి ద్వారా ఏ దారి పడతారో తెలియని దుస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది.తల్లిదంద్రులు పిల్లల పట్టించుకునే స్థితి నుండి ఎప్పుడో దాటి వచ్చేసారు.ఇంత దుస్థితిలో మన తెలుగు సామాజిక పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి.ఇప్పుడే కదా మనమంతా ఆలోచించాల్సింది. ఇప్పుడే కదా వీళ్ళకుమనం అండగా నిలబడాల్సింది.ఇప్పుడే కదా మనము ఏదో ఒకటిచెయ్యాల్సింది.

22 మే, 2010

వెన్నెలా ఆమె మేమూ !

ఆ పిండార బోసిన వెన్నెల కురిసే రాత్రిలో
పులులు కూడా తిరిగే దుర్గమారణ్యంలో
చాలా ధైర్యంగానూ అంతకు మించిన ధీమాతోనూ
నడుస్తూ నడుస్తూ
పచ్చి పచ్చిగా తడితడిగా ఉండేగుండె లోతుల్లోనుండి
ఆమె పుచ్చపువ్వులా నవ్వుతూ నవ్వుతూ
నయాగరా జలపాతాల్ని కన్నుల ముందుకు తెచ్చింది
కులూ మనాలిలో కలవరించిన సంగతులూ
హిమాలయాల్లో మనుషులూ మంచులా కరిగిపోయిన వైనాలూ చెప్పింది
అగాధాల లోతుల్లోకెళ్ళి సంతోష సాగరంలో
ఎలా మునిగి తేలాలో చేసి చూయించింది
మనుషులు జంతువులుగా మారిన రాజ్యంలో
సజీవంగా ఎలా కదలాలో ఆరాత్రే మాముందు ద్రుశ్యీకరించింది
కాలంతో కలిసిపోయి కదిలిపోవడమెలాగో నేర్పించింది
పూలలా సువాసనల్తో రాలిపోవడమెలాగో
గోరింకల్తోసావాసాలూ కోయిలల్తో గానాలూ
నెమలుల్తో నాట్యాలూ చెట్లతోమాటలూ పాటలూ
ప్ర త్యక్షముగా చేసి చూయించింది
ఆ నవ్వులలా పువ్వుల్లా రాలుస్తూనే
లేగల్ని తోడేళ్ళు జింకల్ని పులులూ
ఏనుగుల్ని సింహాలూ తినడమెలాగో చెబుతూ చెబుతూ
మనుషుల్ని మనుషులే పీక్క్కుతినే స్మశాన సంగీతం కూడా
అలవోకగా వినిపించింది
అలా అలా అలల్లా
వెన్నెల కళ్ళల్లో మిలమిల మెరిసే నక్షత్రాలను పూయిస్తూనే ..........
స్నేహాలను కూడా డబ్బు తిమింగళం మింగేయడం
కళ్ళకు కట్టి ప్రయోగంలా మరీ చూయించింది

10 మే, 2010

మనమిప్పుడు మాట్లాడడం నేర్చుకోవాలి

చెట్లసందుల్లో వెలుతురు తునకలు రాలుతుంటాయి
వాటిని ఒక్కొక్కటి ఏరుకుని కళ్ళకద్దుకోవాలి
గుండెల్నిండా చల్లని గాలుల్ని వెచ్చగా పీల్చుకుని
పచ్చపచ్చటి జీవధారల వెంట మనసు పారేసుకోవాలి
కాళ్ళనిండా కళ్ళు మొలిపించుకుని
వొంటినిండా మమతల స్పర్శను నింపుకుని
ఆకుపచ్చని లోయల్లోకి పరావర్తనం చెందాలి
చల్లని హ్రుదయాల్తో వెచ్చని సాయంత్రాల్ని
వొంటినిండా పులుముకుని
ఎరుపు రంగుల్ని కళ్ళకు అద్దుకోవాలి
భూమి తల్లిని సజల నయనాలతో ముద్దాడేందుకు
కదిలి వొచ్చే వాన మబ్బులకు ఎదురుగా నిలబడి
పొగిలి పొగిలి ఏడుస్తూ నమస్కరించాలి
పచ్చటి పైరుతల్లిపై స్వేచ్చగా రెక్కల్ని విప్పార్చుకుని
తారట్లాడే పక్షుల్ని విచ్చుకున్న హ్రుదయాల్లోకి
ఆప్యాయంగా ఆహ్వానించడం నేర్చుకోవాలి
అంతరాంతరాల మూలమూలల్లోకి వెళ్ళి
సుతిమెత్తని స్పర్శతో పులకింపచేసే
సంగీతధారల్ని వీనులవిందుగా స్వాగతించాలి
చేతులు చేతులు పట్టుకుని
ఆకాశంలో విలాసంగా తిరిగే పైరగాలుల్ని
కళ్ళల్లోకి శ్వాసల్లోకీ సమస్త శరీరాంగాల్లోకీ
ఆవాహనం చేసుకోవాలి
ముడుచుకుపోయే భ్రుకుటి ముడి విప్పేసి
బాల్యజ్నాపకాల ప్రేమోహల్ని తలపుల్నిండా నింపుకుని
పగలబడి పగలబడి నవ్వదం నేర్చుకోవాలి
చీకటి తెరల్ని చీల్చుకుని
పూపొదరిళ్ళుంటాయి చూడు
చేతులు బార్లాసాచి
వాటిని ఆలింగనంచేసుకోవాలి
ఎండి మోడువారి
శుష్కించి పోయిన తలపుల్లోనుండి
పచ్చటి శ్వాసలు వెదజల్లే పైర్లను మొలిపించుకోవాలి
తల పైకెత్తి ఆకాశంనిండా
పుచ్చపువ్వుల్లా విరబూస్తున్న నక్షత్రాల్ని
రాత్రిని పక్కుమని నవ్వించే వెన్నెల పూరేకుల్ని
వొళ్ళువిరుచుకుని రారమ్మని వెర్రికేక వెయ్యాలి
అప్పుడప్పుడూ కన్నెర్రజేసే ఆకాశాన్నీ
చెవులు తుప్పొదిలేలా ఉరిమే ఉరుముల్ని
తళుక్కునమెరిసిపోయే మెరుపుల్ని
ఆపైన కుండపోతగా కురిసే నీటినవ్వుల్ని
వొంటినిండా చుట్టుకుని
చిందెయ్యడం నేర్చుకోవాలి
లోహాల్తో పోతపోసి కరుడుకడుతున్న హ్రుదయాల్ని
పూలచూపుల్తో కరిగించుకోవాలి
కర్కశమౌతున్న మనసు వాకిట
మానవత్వం రంగవల్లుల్నితీర్చిదిద్ది
తలుపులు బార్లా తెరిచి మనుషుల్ని ఆహ్వానించడం నేర్చుకోవాలి
చూడాలోయ్ చూపు సారించి దూరతీరపు పొలాల్లోకి
కొండలు దోసిళ్ళతో ఎత్తిపొసే జలపాతాల్లో నిండుగామునిగి తేలకపోతే
బతికిపోయినదానికి అర్థమేముంది!

3 మే, 2010

పాటకుల కోసం మన బాధ్యత

మామూలు తల్లిదండ్రులు సరే కథకులు,కవులు,సాహిత్యవేత్తలు అనుకునేవాళ్ళూ వాళ్ళ పిల్లలకు సాహిత్యం అలవాటు చెయ్యడము లేదు.కొంతమంది సాహిత్యకారులు సాహిత్యం చదివే పిల్లల్ని సైతం చదవడంమాన్పించి పుస్తకాలకు దూరంగా ఉంచుతున్నారు.చాలామంది సాహిత్యం ద్వారా సమాజానికి చెప్పాలనుకునేది ముందు మనవాళ్ళ దగ్గరనుండే మొదలు పెట్టాలి అనుకోవడంలేదు.
ఇవాళ పాఠకుల సంఖ్య చాలా తగ్గిపోయింది అని అందరం బాధపడుతున్నాము.రాష్ట్రం మొత్తం మీద సాహిత్యానికి సంబంధించి వివిధ రంగాలలో ఎన్నో వేల మంది ఉంటారు.వీళ్ళు రోజూ కలుసుకునే పిల్లలు,వీళ్ళు రోజూపాఠ్యాంశాలు బోధించే పిల్లలు ఎంత మంది ఉంటారు.రోజువారీ పాఠ్యాంశాలలో భాగంగా ఒక కథనో,కవితనో,పాటనో,పద్యాన్నో పిల్లలకు వినిపిస్తే భాషమీద ఎంత మమకారం పెరుగుతుంది.అక్కడ నుండేకదా పాఠకుడు మొదలయ్యేది.రచయిత ప్రారంభమయ్యెది.అలానే ప్రతి సాహిత్యకారుడూ మొహమాటానికి పోకుండా తాను ఉండే ఆఫీసులోనో ,తాను పనిచెసే శాఖలొనో ఎందరినో ప్రభావితమం చెయ్యొచ్చు.మొహమాటానికి కొందరు ఆమోదించినా కొందరైనా నిజం తెలుసుకునే వాళ్ళూ ఉంటారు. వాళ్ళద్వారా వాళ్ళ పిల్లల్ల్ని వాళ్ళ ఇంటిలోని వారిని కూడా ప్రభావితం చెయ్యొచ్చు.
మనిషి తలుచుకుంటే ఏపనినైనా సాధించవచ్చు.అయితే ఎవరో చేస్తారు, అందాకా వేచి చూద్దాం అనే ఉదాసీనత మనుషుల్లొ స్థిరపడిపోయింది.అందుకే ఎందరో మేధావులూ, జ్నానులూ ఉండి కూడా ఎవరో అజ్నానులు ప్రతిపాదించిన విధానాలను ఆమోదించి అందరం ఆదారిలొనే తలలొంచుకుని ఏమీ తెలియనట్టు సాగిపోతున్నాం.మనపిల్లలందర్నీతలలు వంచేసి ఆ గాటనే కట్టేస్తున్నాం.వాళ్ళకు జీవితమటే ఎమిటో తెలియకుందా చేస్తున్నాం.ఎన్నాళ్ళీ దుర్మార్గాన్ని భరించుదాం.మనవంతుగా మనమూ ముందడుగు వేద్దాం.మీరూ ఆలోచించండి.