31 మే, 2010

మేధావులారా ఆలోచిద్దాం రండి !

ఏ సమాజపు స్థితిగతులైనా ఆ సమాజంలో అమలుచేసే విద్యావిధానంపైనే ఆధారపడి ఉంటుంది.సమాజంలో అనేకరకాలైన సమస్యలను పట్టించుకునే మేధావులు విద్యావంతులు సైతం భాషా,సంస్క్రుతి,విద్యలను పట్టించికోకపోవడం దురద్రుష్టకరం.
పసిపిల్లల నుండి యువకుల వరకు వారిలో ఉండే సామర్ధ్యాలను నిర్వీర్యం చేసే చదువులు అన్ని ప్రాంతాలకు పాకుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉండడం ఒక్క తెలుగు సమాజానికే చెల్లింది.
ఐదు సంవత్సరాలనుండి మాత్రుభాషలో విద్యాబోధన వల్ల భాషాసామర్ధ్యం పెరుగుతుంది. ఆతరువాత ఏ భాష అయినా సులభంగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఏదేశంలోనైనా మాత్రుభాష ద్వారాబోధించే పద్దతే ఆమల్లో ఉంది.మన పిల్లలకు 2-3 సంవత్సరాలనుండే ఇంగ్లీషును నూరిపోస్తున్నాము.అంటే ఈ వయసులోనే పిల్లల్ని పక్కదారి పట్టిస్తున్నాము.మాత్రుభాష తెలియకుండానే ప్రాధమిక విద్య భాషా సామర్ధ్యాలు నేర్చుకోకుండానే పిల్లలు గట్టెక్కేస్తున్నారు.
ఇక ఆరవతరగతి నుండి ఐఐటి ఫౌండేషన్ పేరుతో ఊదర గొట్టేస్తున్నారు.ఉపాధ్యాయులంటే తప్పనిసరిగా మనోవిగ్నాన శాస్త్రం తెలిసిన వారై ఉండాలి.మరి మన పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులెవరు?పాఠ్యపుస్తకాలలోని విషయాన్ని పదేపదే బట్టీ కొట్టించి తరగతులు గట్టెక్కించేస్తున్నారు.అంటే పాఠ్యపుస్తకాలకు సంబంధించిన విషయాలుగానీ ,సామాజిక విషయాలు కానీ ఏమీ నేర్చుకోకుండానే పదవ తరగతి గట్టెక్కుతున్నారు.వీళ్ళకు భాష తెలియదు,సంస్క్రుతి తెలియదు.సమాజ స్థితి గతులు తెలియవు.పుస్తక పఠనమంటే అస్సలు తెలియదు.
ఇక్కడ నుండి కుస్తీ పోటీలు మొదలవుతాయి.పిల్లల ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యతగానీ అభిరుచులకు ప్రాధాన్యతగానీ ఉండదు.పొలోమంటూ నలుగురు నడిచే దారిలో కళ్ళు మూసుకోని పరుగులు తియ్యడమే.ఈ రెండు సంవత్సరాలు ఎంతగా రసం పీల్చి పిప్పి చెయ్యాలో అంతగా పిప్పిజేసి మార్కెట్ విద్య పేరుతో మార్కెట్లేని విద్యలోకి నెట్టేస్తున్నాము.అంటే ఇక్కడా పిల్లల ఇష్టాయిష్టాలతో పనిలేదు.ఒక అవగాహనలేదు.ఒక ఆలోచనలేదు,ఒక ద్రుక్పదములేదు,జీవితము మీద అంతకంటే అవగాహనలేదు.అలాంటి పిల్లలు సమాజములోనికి వస్తే ఏం జరుగుతుంది.అంతా అరాచకమే గదా !ఇలాంటి పశు ప్రవ్రుత్తి కలిగిన యువతరాన్ని సమాజము మీదకు వదిలి వేస్తున్నాము.ఇక సమాజములో మేధావులెలా పుడతారు.శాస్త్రవేత్తలు ఎక్కడి నుండి వస్తారు.సమాజాన్ని గురించి ఆలోచించేవాళ్ళు ఎక్కడి నుండి పుడతారు.కనీసం వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకోలేని ఒక తరం మన కళ్ళ ముందు తిరుగాడుతూ ఉంది.
వీటికి తోడు ఇంటర్నెట్,సెల్ఫోన్,టీవీ వంటి మంత్ర సామాగ్రి ఉండనే ఉంది.వీటికి ఎంత సమయము కేటాయిస్తారో,వీటి ద్వారా ఏ దారి పడతారో తెలియని దుస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది.తల్లిదంద్రులు పిల్లల పట్టించుకునే స్థితి నుండి ఎప్పుడో దాటి వచ్చేసారు.ఇంత దుస్థితిలో మన తెలుగు సామాజిక పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి.ఇప్పుడే కదా మనమంతా ఆలోచించాల్సింది. ఇప్పుడే కదా వీళ్ళకుమనం అండగా నిలబడాల్సింది.ఇప్పుడే కదా మనము ఏదో ఒకటిచెయ్యాల్సింది.

2 కామెంట్‌లు:

  1. అన్నిటికంటే దురదృష్టకరమైన విషయం ఏమంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఈ విషయంపై కనీసం ఆలోచన చేయకపోవడం. సమస్యను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేయలేక పోయారు. తల్లిదండ్రులు మార్కుల మాయలో పడిపోయారు. మరి ప్రక్షాళన ఎలా సాధ్యం?

    రిప్లయితొలగించండి
  2. పిల్లల గురించి మీ ఆవేదన లాంటిదే నా ఆవేదన కూడా.

    రిప్లయితొలగించండి