14 జులై, 2010

వారధి రచయితల సహకార వేదిక ఏర్పాటు ఒక సామాజిక బాధ్యత

వారధి రచయితల సహకార వేదిక ఏర్పాటు సాదా సీదాగా అతి కొద్ది మందితో జరిగినా ఈ వేదిక ఆవిర్భావంలో ఒక ఉన్నత మైన ఆశయం చోటు చేసుకుని ఉంది.రచయితలంతా కలిసి కథలు ప్రచురణ చేసుకుని ,పంపిణీ చేసుకుని పేరు ప్రతిష్టలు పెంపొందించుకుని, మేమూ రచయితలమే అని చాటింపు వేసుకోవడానికి మాత్రమే ఈ వేదిక పరిమితమైంది కాదు.ఎందరెందరో రచయితలు ,సామాజిక కార్యకర్తలు బాధ్యతలు మరిచి సౌకర్యాల కోసమే ఆరాటపడుతున్నఈసందర్భంలో మేము మా బాధ్యతగా ఈవేదికను ఏర్పాటు చేశాం.ఐతే మొదటి అడుగుగా వేసిన నవతరం తెలుగు కథ సందర్భంలో మా ప్రయత్నాన్ని కొందరు సహృదయులు అర్థం చేసుకున్నారు.ఇంకొందరు అపార్థం చేసుకున్నారు.

ఇవాల్టి సామాజిక సందర్భం అత్యంత సంక్లిష్ట మైనది .అత్యంత విషాద భరితమైనది.అంతా బాగానే ఉంది. కానీ ఎందుకింత అశాంతి చోటు చేసుకుంటున్నది మనిషికి లోపలా బయటా. ఎవరికి ఎవరూ కాకుండా ఎందుకు పోతున్నారు.ఒకే కప్పు కింద ఉంటూ కూడా ఒంటరి బ్రతుకులు ఎందుకు బ్రతుక వలసి వస్తుంది.ఏమిటీ మాయల మరాఠీలు సృష్టించే మాయాజాలం? ఈ సందర్భమే ,ఈ ప్రశ్నలే మా అడుగు ముందుకు వెయ్యడానికి మమ్మల్ని పురికొల్పింది. చాలా మంది అనుకుంటున్నట్టుగా ఇది ఎవరికీ పోటీ కాదు.ఏ వొక్కరూ నిర్వహించేదీ కాదు.వ్యక్తిగతమైంది అంతకంటే కాదు.సామూహికంగా రచయితలు కలవడానికీ,విభిన్నమైన అభిప్రాయాలు చర్చించుకోవడానికి,ఉన్నతమైన రచనలు చెయ్యడానికీ,ప్రచురించు కోవడానికీ, రచయితలలోనూ,పాఠకులలలోనూ సమాజం పట్ల ఆలోచనా,అవగాహనా పెంపొందించుకునే దిశగా పయనించాలనేది మా అభిమతం. నలుమూలలా ఉన్న పాఠకులను చేరడానికి, వీలైనంత తక్కువ ఖర్చుకే సాహిత్యాన్ని అందించడానికి ఏర్పాటు చేసుకున్న విశాలమైన వేదికే ఇది.

ఈ వేదిక నుండి ఏటా ఒక్క సంకలనము మాత్రమే ప్రచురించ బడదు..అన్ని వాదాలు ,సిద్ధాంతాలను అంగీకరిస్తూనే అవసరమైన చర్చలు జరుపుతూనే వేదిక విస్తరించాలనేది మా అభిప్రాయం. రచయితల సంఖ్య వేదికలో పెరిగే కొద్దీ ,రచయితలు వేదికలో చేరే కొద్దీ సంకలనాల సంఖ్య కూడా విస్తరిస్తూ పోవాలన్నదే మాసంకల్పం.ఈ వేదికలో చేరడానికి ఇంతకు ముందులాగా ఎలాంటి నియమ నిబందనలు లేవు.మంచి రచనలు చేయగలగడము,కలిసి పని చెయ్యడమే అందరికీ కావలసింది.ఈ విధంగా ముందుకు నడుస్తూ నడుస్తూ సాహిత్యంలో సహకార వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలన్నదే మా ఆశ.

నవతరం తెలుగు కథ వచ్చి సంవత్సరము దాటినప్పటికి తదుపరి సంకలనం కొంత ఆలస్యమైన మాట వాస్తవమే.ఈఆలశ్యానికి పెద్దగా చెప్పుకోదగ్గ కారణాలేమీ లేవు .ఒక కూడలిలో మొదలైన ప్రయాణం బలం పుంజుకుని వేగవంతం కావడానికి,విస్తృతం కావడానికి,ఉత్సాహము రెట్టింపు కావడానికే ఈ విరామం.ఒక కథతో మొదలైన ఈ ప్రయత్నం అనేక కథలుగా కవిత్వంగా,అనువాదాలుగా అనేక సాహిత్య ప్రక్రియల సమాహారంగా ఎదగడానికే మరింత మాఈ నిదానం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి