28 జూన్, 2010

కిచకిచలు

వొరిచేలు పాలు పోసుకున్నప్పటి నుండీ
కళ్ళారా చూస్తూనే ఉంటాము
ఆయన గాలి పీల్చినంత గుర్తుగా
రోజూ వొరి ఎన్నులు
గుప్పిట పట్టుకొని గుర్తుగా రావడం
ఇంటి ముంగిట మైమరిచి పోతూ వేలాడ దీయడం
పిచ్చికలు సైగ సైగ్గా పందిట్లోకి
ఎగురుకుంటూ రావడం
చిరు సవ్వడికి ఎగిరి పోయినట్టే వెనక్కు పోవడం
మళ్ళీ నేలమీద వాలడం
అడుగు దీసి అడుగేయడం
ఎగరడం వాలడం
ఎన్నుల్ని కన్నుల్నిండా కలగనడం
కాళ్ళు ముందుకీ కళ్ళు పైకీ చక్రాల్లా తిప్పడం
బతుకంత భరోసా దొరికాక
రివ్వున గాల్లోకి ఎగిరి ఎన్నులపై వాలడం
ఎన్నెన్నో కిచకిచల్ని రాల్చడం
గింజల్ని గానం చెయ్యడం
పాటలు విని మానాన్న పరవశం చెందడం
కరిగిపోని చెరిగిపోని కల ఈడేరినట్టు పరవసించడం
రోజూ చూశే సెలయేటి పాట
ఇంటింటి పంచలో నెమలి ఆడే ఆట

25 జూన్, 2010

మా ట్రెక్కింగ్ మేమూ




పొలం అమ్మడం బాధగా ఉంటుంది

ఎంతోమురిపెంతో ఆప్యాయంగా పెంచుకున్న

పచ్చటిపైట చుట్టుకున్న పైరుతల్లులు

వడివడిగా సుడులు తిరిగే పంట కాలువలు

పంటలపై వల విసిరేసినట్టు గబుక్కున వాలే

పక్షుల గుంపుల నొదిలి

పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

తెలతెలవారక ముందే పొలందారి వెంట

గడ్డి పూలపై మంచు బిందువుల మాటలతో

అక్కా బావా అన్నా వదినా అంటూ పిలిచే వలపుల పిలుపులు

పక్క పక్క చేలల్లో నుండి జాలువారే

బావా మరదళ్ళ నవరసాల వరసల సరసాలు

ఆకుపచ్చదారంతా వచ్చే పోయే వాళ్ళ ఆప్యాయతా పిలుపులనొదిలి

పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

వర్షానికి తడిసి ఆవిరై ఎగసిపడే

కమ్మటి నేలతల్లి సువాసనల నొదిలి

మేలిమి విత్తనాలనుండి

కువకువల్తో తొంగిచూసే కోడిపిల్లల్లాంటి

లేలేత మొక్కల్నొదిలి

పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

పండిన చేలు తలలూపుతూ పాడే పాటలు

గాలి నలువైపులా మోసుకుపోయే కొత్త ధాన్యపు ఘుమఘుమలు

బండినిండా బస్తాలు నింపుకొని చెర్నాకోలతో

ఎద్దుల్ని ఆప్యాయంగా అదిలించే అదిలింపుల నొదిలి

పొలం అమ్మడం చాలా బాధగా ఉంటుంది

కల్తీ పురుగు మందులు నకిలీ విత్తనాలు

సకాలంలోపడని వర్షాలకు

ఎన్నిసార్లు నష్టాల ఊబిలో కూరుకు పోతున్నా

గోడక్కొట్టిన బంతిలా

మళ్ళీ మళ్ళీ దుక్కి దున్ని విత్తులు చల్లినా

ఆశలు మోసులెత్తక

రాశులు రాశులుగా పెరిగిపోతున్న

అప్పులు తీర్చేందుకు

పొలం అమ్మడం బాధగా ఉంటుంది

18 జూన్, 2010

మన ప్రభుత్వాలు సిగ్గుపడేది ఎప్పుడు?

కోట్ల రూపాయలు,వందల ఎకరాలు,వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు,ఇంకెంతోమంది కార్మికులు రేయింబవళ్ళూ శ్రమిస్తున్నారు మహానాడు విజయవంతం చేయడం కోసం. ఇది ఏ పార్టీజరిపే మహానాడు కాదు. ఒక భాష కోసం మన పొరుగునే ఉన్న తమిళనాడు ప్రభుత్వం తమిళ భాష కోసం జరిపే మహానాడు.ఐదు రోజుల పాటు జరిగే ఈ మహానాడులో పాల్గొనడానికి ప్రపంచములో ఉండే 50 దేశాల నుండి అనేక లక్షల మంది తమిళులు హాజరు అవుతున్నారు.
ఒక పాట ఒకే ఒక్కపాట కోసం 70 మంది గాయకులు,పరిశ్రమలోని సంగీత దర్శకులు అందరూ తలిళ జాతి ఔన్నత్యం కోసం ప్రాచీన తమిళ కవుల గొప్పతనాన్నిచాటేలా ముఖ్యమంత్రి కరుణానిధి, వాలి,వైరముత్తు లాంటి వారి సహకారంతో రాసిన పాటను రూపొందించటానికి రాత్రింబవళ్ళూ శ్రమించడం,స్వయంగా ఏ.ఆర్. రహమాన్ పాట పాడడానికి పూనుకోవడం నిజంగా ఆ భాష చేసుకున్న పుణ్యం ఆ అభిమానులు ఆ మట్టి ,ఆ సంస్క్రుతి కలకాలం నిలిచి ఉండడానికి ఆ భాషే వాళ్ళను కలకాలం కాపాడుతుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది.
ఆ పడుగను ఆ రాష్ట్రమంతా కన్నుల పండుగగా చేసుకోవడానికి ప్రజలంతా సమాయత్తమవుతున్నారు.మరి వాళ్ళు భాషను అంతగా ప్రేమిస్తున్నారు .
అదే అదే మాభాష
జయహే జయహే జయహే అంటూ మన పొరుగున ఉన్న మన సోదరులు ఉప్పొంగిపోతున్నారు.మరి మనం... మన ప్రభుత్వాలు సిగ్గుపడేదెప్పుడు?

31 మే, 2010

మేధావులారా ఆలోచిద్దాం రండి !

ఏ సమాజపు స్థితిగతులైనా ఆ సమాజంలో అమలుచేసే విద్యావిధానంపైనే ఆధారపడి ఉంటుంది.సమాజంలో అనేకరకాలైన సమస్యలను పట్టించుకునే మేధావులు విద్యావంతులు సైతం భాషా,సంస్క్రుతి,విద్యలను పట్టించికోకపోవడం దురద్రుష్టకరం.
పసిపిల్లల నుండి యువకుల వరకు వారిలో ఉండే సామర్ధ్యాలను నిర్వీర్యం చేసే చదువులు అన్ని ప్రాంతాలకు పాకుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉండడం ఒక్క తెలుగు సమాజానికే చెల్లింది.
ఐదు సంవత్సరాలనుండి మాత్రుభాషలో విద్యాబోధన వల్ల భాషాసామర్ధ్యం పెరుగుతుంది. ఆతరువాత ఏ భాష అయినా సులభంగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఏదేశంలోనైనా మాత్రుభాష ద్వారాబోధించే పద్దతే ఆమల్లో ఉంది.మన పిల్లలకు 2-3 సంవత్సరాలనుండే ఇంగ్లీషును నూరిపోస్తున్నాము.అంటే ఈ వయసులోనే పిల్లల్ని పక్కదారి పట్టిస్తున్నాము.మాత్రుభాష తెలియకుండానే ప్రాధమిక విద్య భాషా సామర్ధ్యాలు నేర్చుకోకుండానే పిల్లలు గట్టెక్కేస్తున్నారు.
ఇక ఆరవతరగతి నుండి ఐఐటి ఫౌండేషన్ పేరుతో ఊదర గొట్టేస్తున్నారు.ఉపాధ్యాయులంటే తప్పనిసరిగా మనోవిగ్నాన శాస్త్రం తెలిసిన వారై ఉండాలి.మరి మన పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులెవరు?పాఠ్యపుస్తకాలలోని విషయాన్ని పదేపదే బట్టీ కొట్టించి తరగతులు గట్టెక్కించేస్తున్నారు.అంటే పాఠ్యపుస్తకాలకు సంబంధించిన విషయాలుగానీ ,సామాజిక విషయాలు కానీ ఏమీ నేర్చుకోకుండానే పదవ తరగతి గట్టెక్కుతున్నారు.వీళ్ళకు భాష తెలియదు,సంస్క్రుతి తెలియదు.సమాజ స్థితి గతులు తెలియవు.పుస్తక పఠనమంటే అస్సలు తెలియదు.
ఇక్కడ నుండి కుస్తీ పోటీలు మొదలవుతాయి.పిల్లల ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యతగానీ అభిరుచులకు ప్రాధాన్యతగానీ ఉండదు.పొలోమంటూ నలుగురు నడిచే దారిలో కళ్ళు మూసుకోని పరుగులు తియ్యడమే.ఈ రెండు సంవత్సరాలు ఎంతగా రసం పీల్చి పిప్పి చెయ్యాలో అంతగా పిప్పిజేసి మార్కెట్ విద్య పేరుతో మార్కెట్లేని విద్యలోకి నెట్టేస్తున్నాము.అంటే ఇక్కడా పిల్లల ఇష్టాయిష్టాలతో పనిలేదు.ఒక అవగాహనలేదు.ఒక ఆలోచనలేదు,ఒక ద్రుక్పదములేదు,జీవితము మీద అంతకంటే అవగాహనలేదు.అలాంటి పిల్లలు సమాజములోనికి వస్తే ఏం జరుగుతుంది.అంతా అరాచకమే గదా !ఇలాంటి పశు ప్రవ్రుత్తి కలిగిన యువతరాన్ని సమాజము మీదకు వదిలి వేస్తున్నాము.ఇక సమాజములో మేధావులెలా పుడతారు.శాస్త్రవేత్తలు ఎక్కడి నుండి వస్తారు.సమాజాన్ని గురించి ఆలోచించేవాళ్ళు ఎక్కడి నుండి పుడతారు.కనీసం వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకోలేని ఒక తరం మన కళ్ళ ముందు తిరుగాడుతూ ఉంది.
వీటికి తోడు ఇంటర్నెట్,సెల్ఫోన్,టీవీ వంటి మంత్ర సామాగ్రి ఉండనే ఉంది.వీటికి ఎంత సమయము కేటాయిస్తారో,వీటి ద్వారా ఏ దారి పడతారో తెలియని దుస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది.తల్లిదంద్రులు పిల్లల పట్టించుకునే స్థితి నుండి ఎప్పుడో దాటి వచ్చేసారు.ఇంత దుస్థితిలో మన తెలుగు సామాజిక పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి.ఇప్పుడే కదా మనమంతా ఆలోచించాల్సింది. ఇప్పుడే కదా వీళ్ళకుమనం అండగా నిలబడాల్సింది.ఇప్పుడే కదా మనము ఏదో ఒకటిచెయ్యాల్సింది.

22 మే, 2010

వెన్నెలా ఆమె మేమూ !

ఆ పిండార బోసిన వెన్నెల కురిసే రాత్రిలో
పులులు కూడా తిరిగే దుర్గమారణ్యంలో
చాలా ధైర్యంగానూ అంతకు మించిన ధీమాతోనూ
నడుస్తూ నడుస్తూ
పచ్చి పచ్చిగా తడితడిగా ఉండేగుండె లోతుల్లోనుండి
ఆమె పుచ్చపువ్వులా నవ్వుతూ నవ్వుతూ
నయాగరా జలపాతాల్ని కన్నుల ముందుకు తెచ్చింది
కులూ మనాలిలో కలవరించిన సంగతులూ
హిమాలయాల్లో మనుషులూ మంచులా కరిగిపోయిన వైనాలూ చెప్పింది
అగాధాల లోతుల్లోకెళ్ళి సంతోష సాగరంలో
ఎలా మునిగి తేలాలో చేసి చూయించింది
మనుషులు జంతువులుగా మారిన రాజ్యంలో
సజీవంగా ఎలా కదలాలో ఆరాత్రే మాముందు ద్రుశ్యీకరించింది
కాలంతో కలిసిపోయి కదిలిపోవడమెలాగో నేర్పించింది
పూలలా సువాసనల్తో రాలిపోవడమెలాగో
గోరింకల్తోసావాసాలూ కోయిలల్తో గానాలూ
నెమలుల్తో నాట్యాలూ చెట్లతోమాటలూ పాటలూ
ప్ర త్యక్షముగా చేసి చూయించింది
ఆ నవ్వులలా పువ్వుల్లా రాలుస్తూనే
లేగల్ని తోడేళ్ళు జింకల్ని పులులూ
ఏనుగుల్ని సింహాలూ తినడమెలాగో చెబుతూ చెబుతూ
మనుషుల్ని మనుషులే పీక్క్కుతినే స్మశాన సంగీతం కూడా
అలవోకగా వినిపించింది
అలా అలా అలల్లా
వెన్నెల కళ్ళల్లో మిలమిల మెరిసే నక్షత్రాలను పూయిస్తూనే ..........
స్నేహాలను కూడా డబ్బు తిమింగళం మింగేయడం
కళ్ళకు కట్టి ప్రయోగంలా మరీ చూయించింది

10 మే, 2010

మనమిప్పుడు మాట్లాడడం నేర్చుకోవాలి

చెట్లసందుల్లో వెలుతురు తునకలు రాలుతుంటాయి
వాటిని ఒక్కొక్కటి ఏరుకుని కళ్ళకద్దుకోవాలి
గుండెల్నిండా చల్లని గాలుల్ని వెచ్చగా పీల్చుకుని
పచ్చపచ్చటి జీవధారల వెంట మనసు పారేసుకోవాలి
కాళ్ళనిండా కళ్ళు మొలిపించుకుని
వొంటినిండా మమతల స్పర్శను నింపుకుని
ఆకుపచ్చని లోయల్లోకి పరావర్తనం చెందాలి
చల్లని హ్రుదయాల్తో వెచ్చని సాయంత్రాల్ని
వొంటినిండా పులుముకుని
ఎరుపు రంగుల్ని కళ్ళకు అద్దుకోవాలి
భూమి తల్లిని సజల నయనాలతో ముద్దాడేందుకు
కదిలి వొచ్చే వాన మబ్బులకు ఎదురుగా నిలబడి
పొగిలి పొగిలి ఏడుస్తూ నమస్కరించాలి
పచ్చటి పైరుతల్లిపై స్వేచ్చగా రెక్కల్ని విప్పార్చుకుని
తారట్లాడే పక్షుల్ని విచ్చుకున్న హ్రుదయాల్లోకి
ఆప్యాయంగా ఆహ్వానించడం నేర్చుకోవాలి
అంతరాంతరాల మూలమూలల్లోకి వెళ్ళి
సుతిమెత్తని స్పర్శతో పులకింపచేసే
సంగీతధారల్ని వీనులవిందుగా స్వాగతించాలి
చేతులు చేతులు పట్టుకుని
ఆకాశంలో విలాసంగా తిరిగే పైరగాలుల్ని
కళ్ళల్లోకి శ్వాసల్లోకీ సమస్త శరీరాంగాల్లోకీ
ఆవాహనం చేసుకోవాలి
ముడుచుకుపోయే భ్రుకుటి ముడి విప్పేసి
బాల్యజ్నాపకాల ప్రేమోహల్ని తలపుల్నిండా నింపుకుని
పగలబడి పగలబడి నవ్వదం నేర్చుకోవాలి
చీకటి తెరల్ని చీల్చుకుని
పూపొదరిళ్ళుంటాయి చూడు
చేతులు బార్లాసాచి
వాటిని ఆలింగనంచేసుకోవాలి
ఎండి మోడువారి
శుష్కించి పోయిన తలపుల్లోనుండి
పచ్చటి శ్వాసలు వెదజల్లే పైర్లను మొలిపించుకోవాలి
తల పైకెత్తి ఆకాశంనిండా
పుచ్చపువ్వుల్లా విరబూస్తున్న నక్షత్రాల్ని
రాత్రిని పక్కుమని నవ్వించే వెన్నెల పూరేకుల్ని
వొళ్ళువిరుచుకుని రారమ్మని వెర్రికేక వెయ్యాలి
అప్పుడప్పుడూ కన్నెర్రజేసే ఆకాశాన్నీ
చెవులు తుప్పొదిలేలా ఉరిమే ఉరుముల్ని
తళుక్కునమెరిసిపోయే మెరుపుల్ని
ఆపైన కుండపోతగా కురిసే నీటినవ్వుల్ని
వొంటినిండా చుట్టుకుని
చిందెయ్యడం నేర్చుకోవాలి
లోహాల్తో పోతపోసి కరుడుకడుతున్న హ్రుదయాల్ని
పూలచూపుల్తో కరిగించుకోవాలి
కర్కశమౌతున్న మనసు వాకిట
మానవత్వం రంగవల్లుల్నితీర్చిదిద్ది
తలుపులు బార్లా తెరిచి మనుషుల్ని ఆహ్వానించడం నేర్చుకోవాలి
చూడాలోయ్ చూపు సారించి దూరతీరపు పొలాల్లోకి
కొండలు దోసిళ్ళతో ఎత్తిపొసే జలపాతాల్లో నిండుగామునిగి తేలకపోతే
బతికిపోయినదానికి అర్థమేముంది!

3 మే, 2010

పాటకుల కోసం మన బాధ్యత

మామూలు తల్లిదండ్రులు సరే కథకులు,కవులు,సాహిత్యవేత్తలు అనుకునేవాళ్ళూ వాళ్ళ పిల్లలకు సాహిత్యం అలవాటు చెయ్యడము లేదు.కొంతమంది సాహిత్యకారులు సాహిత్యం చదివే పిల్లల్ని సైతం చదవడంమాన్పించి పుస్తకాలకు దూరంగా ఉంచుతున్నారు.చాలామంది సాహిత్యం ద్వారా సమాజానికి చెప్పాలనుకునేది ముందు మనవాళ్ళ దగ్గరనుండే మొదలు పెట్టాలి అనుకోవడంలేదు.
ఇవాళ పాఠకుల సంఖ్య చాలా తగ్గిపోయింది అని అందరం బాధపడుతున్నాము.రాష్ట్రం మొత్తం మీద సాహిత్యానికి సంబంధించి వివిధ రంగాలలో ఎన్నో వేల మంది ఉంటారు.వీళ్ళు రోజూ కలుసుకునే పిల్లలు,వీళ్ళు రోజూపాఠ్యాంశాలు బోధించే పిల్లలు ఎంత మంది ఉంటారు.రోజువారీ పాఠ్యాంశాలలో భాగంగా ఒక కథనో,కవితనో,పాటనో,పద్యాన్నో పిల్లలకు వినిపిస్తే భాషమీద ఎంత మమకారం పెరుగుతుంది.అక్కడ నుండేకదా పాఠకుడు మొదలయ్యేది.రచయిత ప్రారంభమయ్యెది.అలానే ప్రతి సాహిత్యకారుడూ మొహమాటానికి పోకుండా తాను ఉండే ఆఫీసులోనో ,తాను పనిచెసే శాఖలొనో ఎందరినో ప్రభావితమం చెయ్యొచ్చు.మొహమాటానికి కొందరు ఆమోదించినా కొందరైనా నిజం తెలుసుకునే వాళ్ళూ ఉంటారు. వాళ్ళద్వారా వాళ్ళ పిల్లల్ల్ని వాళ్ళ ఇంటిలోని వారిని కూడా ప్రభావితం చెయ్యొచ్చు.
మనిషి తలుచుకుంటే ఏపనినైనా సాధించవచ్చు.అయితే ఎవరో చేస్తారు, అందాకా వేచి చూద్దాం అనే ఉదాసీనత మనుషుల్లొ స్థిరపడిపోయింది.అందుకే ఎందరో మేధావులూ, జ్నానులూ ఉండి కూడా ఎవరో అజ్నానులు ప్రతిపాదించిన విధానాలను ఆమోదించి అందరం ఆదారిలొనే తలలొంచుకుని ఏమీ తెలియనట్టు సాగిపోతున్నాం.మనపిల్లలందర్నీతలలు వంచేసి ఆ గాటనే కట్టేస్తున్నాం.వాళ్ళకు జీవితమటే ఎమిటో తెలియకుందా చేస్తున్నాం.ఎన్నాళ్ళీ దుర్మార్గాన్ని భరించుదాం.మనవంతుగా మనమూ ముందడుగు వేద్దాం.మీరూ ఆలోచించండి.

26 ఏప్రి, 2010

"పాఠకుల సంఖ్య పెరగడమేలా"

మనిషి తాను ఏ పరిస్థితులలో ఉన్నా తన మనుగడ సాగించడానికి ,తన జీవన యాత్రలో సంభవించే ఆటుపోట్లను ఎదుర్కోవడానికి ప్రాపంచిక జ్ఞానం అవసరం .మనిషికి జ్ఞాన్నిచ్చే ప్రధానమైన మార్గాలలో పుస్తకం ఒకటి .ఇవాళ ప్రత్యేకించి మన రాష్ట్రంలో టివీ ,సినిమా ,ఇతర ఆదాయ వనరులు, అనేక వ్యాపకాల వల్ల మనుషులు పుస్తకానికి దూరం అయ్యారు. ఈనాటి ఇంగ్లీషు చదువులవల్ల ఒక తరం సర్వ నాశనం అయిపోయింది .దీంతో ఎన్నోరకాల సమస్యలు మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి . మనుషుల్ని ఆత్మహత్యలవైపు ప్రేరేపిస్తున్నాయి .వీటి నుండి బయట పడాలంటే మళ్లీ పుస్తకం వైపు అడుగులు పడాల్సిందే .
ఇప్పటికే పిల్లల సాహిత్యం పుంఖాను పుంఖాలుగా వెలువడుతూ ఉండడముతో పిల్లలు నెమ్మది నేమ్మదిగా పుస్తకము వైపుకు మరలారనే అనుకోవాలి. కాని ఈనాటి విద్యా విధానంవల్ల, తల్లిదండ్రుల ప్రలోభం తారాస్థాయికి చేరుకుంది.ఎక్కడ పిల్లలు సాహిత్యం చవితే కాలము వృధా అయి పోయి ర్యాంకుల్లో వెనుకపడి పోతారనే అపోహలో తల్లిదండ్రులు ఉన్నారు. వాస్తవానికి మనం గమనించాల్సింది పిల్లలు ఎంత సృజనాత్మకంగా ఉంటే చదువులో కూడా అంత ముందు ఉంటారు .పుస్తకాలను ఎంత చదివితే చదువులోనూ ,జీవితములోనూ అంత ముందు ఉంటారు.
మామూలు తల్లిదండ్రులు సరే కథకులూ ,కవులూ, సాహిత్యవేత్తలూ, అలా అనుకునెవాళ్ళూ కూడా వాళ్ళ పిల్లలకూ సాహిత్యం అలవాటు చెయ్యడం లేదు. కొంతమంది సాహిత్యకారులైతే సాహిత్యం చదివే పిల్లల్ల్ని సైతం మానిపించి పుస్తకాలకు దూరంగా ఉంచారు .సాహిత్యం ద్యారా సమాజానికి చెప్పాలనుకునేది ముందు మనవాళ్ళకు మనపిల్లల దగ్గర నుండే మొదలు పెట్టాలి.
మామూలు తల్లిదండ్రులు సరే కథకులు,కవులు,సాహిత్యవేత్తలు అనుకునేవాళ్ళూ వాళ్ళ పిల్లలకు సాహిత్యం అలవాటు చెయ్యడము లేదు.కొంతమంది సాహిత్యకారులు సాహిత్యం చదివే పిల్లల్ని సైతం చదవడంమాన్పించి పుస్తకాలకు దూరంగా ఉంచుతున్నారు.చాలామంది సాహిత్యం ద్వారా సమాజానికి చెప్పాలనుకునేది ముందు మనవాళ్ళ దగ్గరనుండే మొదలు పెట్టాలి అనుకోవడంలేదు.
ఇవాళ పాఠకుల సంఖ్య చాలా తగ్గిపోయింది అని అందరం బాధపడుతున్నాము.రాష్ట్రం మొత్తం మీద సాహిత్యానికి సంబంధించి వివిధ రంగాలలో ఎన్నో వేల మంది ఉంటారు.వీళ్ళు రోజూ కలుసుకునే పిల్లలు,వీళ్ళు రోజూపాఠ్యాంశాలు బోధించే పిల్లలు ఎంత మంది ఉంటారు.రోజువారీ పాఠ్యాంశాలలో భాగంగా ఒక కథనో,కవితనో,పాటనో,పద్యాన్నో పిల్లలకు వినిపిస్తే భాషమీద ఎంత మమకారం పెరుగుతుంది.అక్కడ నుండేకదా పాఠకుడు మొదలయ్యేది.రచయిత ప్రారంభమయ్యెది.అలానే ప్రతి సాహిత్యకారుడూ మొహమాటానికి పోకుండా తాను ఉండే ఆఫీసులోనో ,తాను పనిచెసే శాఖలొనో ఎందరినో ప్రభావితమం చెయ్యొచ్చు.మొహమాటానికి కొందరు ఆమోదించినా కొందరైనా నిజం తెలుసుకునే వాళ్ళూ ఉంటారు. వాళ్ళద్వారా వాళ్ళ పిల్లల్ల్ని వాళ్ళ ఇంటిలోని వారిని కూడా ప్రభావితం చెయ్యొచ్చు.
మనిషి తలుచుకుంటే ఏపనినైనా సాధించవచ్చు.అయితే ఎవరో చేస్తారు, అందాకా వేచి చూద్దాం అనే ఉదాసీనత మనుషుల్లొ స్థిరపడిపోయింది.అందుకే ఎందరో మేధావులూ, జ్నానులూ ఉండి కూడా ఎవరో అజ్నానులు ప్రతిపాదించిన విధానాలను ఆమోదించి అందరం ఆదారిలొనే తలలొంచుకుని ఏమీ తెలియనట్టు సాగిపోతున్నాం.మనపిల్లలందర్నీతలలు వంచేసి ఆ గాటనే కట్టేస్తున్నాం.వాళ్ళకు జీవితమటే ఎమిటో తెలియకుందా చేస్తున్నాం.ఎన్నాళ్ళీ దుర్మార్గాన్ని భరించుదాం.మనవంతుగా మనమూ ముందడుగు వేద్దాం.మీరూ ఆలోచించండి.

15 ఏప్రి, 2010

పుస్తకమార్గం

ఊహ తెలిసినప్పటి నుండీ
పుస్తకాలను స్పర్శిస్తే చాలు
చందమామలు మా పెరటి చెట్టు కొమ్మలకు వేలాడేవి
నక్షత్రాలు మా ఇంటిముంగిట పందిరి వేసేవి
మేఘాలు ముసురుకుని పలపలా వర్షించేవి
అక్షరాలను ప్రేమగా వెన్ను నిమిరినప్పుడల్లా
రంగురంగుల పక్షులు ఎగురుతూ వచ్చి నా మేనిపై సయ్యాటలాడేవి
అడవులూ కొండలూ నదులూ లోయలూ
నా కళ్ళ ముందు కదులుతున్న చలనచిత్రాలయ్యేవి
ఒంటికంటి రాక్షసులూ అందమైన రాకుమార్తెలూ
మా ఇంటికొచ్చి పలకరించి పోయేవాళ్ళు
ఆకాశంలోకి ఎగరాలనుకున్నప్పుడు పుస్తకంలో తలదూర్చి
మబ్బుల్లో గిరికీలు కొట్టేవాడిని
ఈదాలనుకున్నప్పుడు సెలయేటి నీటిలో సయ్యాటలాడేవాడీని
ఇంద్రధనస్సులను పిలిచి రంగుల్లో మునిగి తేలేవాడిని
రాజహంసలతో సరాగాలాడేవాడిని
పుస్తకాల్నిండా నెమలికన్నులు అప్పుడప్పుడూ
బిడ్డల తల్లులయ్యేవి
వెలుతురు పిట్టలు మంత్రపు పుల్లలు తెచ్చిచ్చేవి
దూరాభారం ప్రయాణించాలనుకున్నప్పుడు
హాయిగా వెల్లకిలా పడుకుని కళ్ళు మూసుకుని
ఇష్టమైన పుస్తకాన్ని పొట్టపై బోర్లించుకునే వాడిని
రెక్కలు మొల్చుకొచ్చి ఎన్ని యోజనాలైనా ఎగురుతూ పోయేవాడిని
పర్వతాల్ని అధిరోహించేవాణ్ణి
లోయల వెంట ఉరుకులు పరుగులు తీసేవాణ్ని
రాజభవనాలకు వెళ్ళి రాజుల్నీ రాణుల్నీ పలకరించొచ్చేవాడిని
పులులతోనూ సింహాలతోనూ జూలు పట్టుకుని ఆడుకునేవాడిని
పుస్తకాల్నిండా ఎందరో నా సావాసగాళ్ళు కొలువుతీరి
సయ్యాటలకు ఉసిగొల్పుతుండేవాళ్ళు
పుస్తకం నాకు గాఢ నిద్రలో నుండి వెలుతురు తోటలోకి
దారి చూపే వెన్నెల పూదోట
మామూలు మనిషి ఙ్ఞాని కావడానికీ ఙ్ఞాని బుద్ధుడు కావడానికీ
ఎన్నెన్నో బోధనల్ని చేసేది పుస్తకమే
మనిషి మనిషిగా మనగలగడానికీ
పదిమందిని మానవతా స్పర్శతో అక్కున చేర్చుకోవడానికీ
పుస్తకం ఒక జీవన మార్గం పుస్తకమే ఒక జీవన గమ్యం